16న కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం

దేశ రాజధాని ఢిల్లీలో హ్యాట్రిక్‌ విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నూతన సర్కార్‌ను ఏర్పాటు చేయడానికి అడుగులు వేస్తున్నది. ముచ్చటగా మూడోసారి చారిత్రక రామ్‌లీలా మైదాన్‌లో ఈ నెల 16 ఉదయం 10 గంటలకు సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణం చేయనున్నారు. ఇంతకుముందు కూడా ఇదే మైదానంలో ఆయన రెండుసార్లు సీఎంగా ప్రమాణం చేశారు. కేజ్రీవాల్‌తోపాటు క్యాబినెట్‌ మంత్రులంతా ప్రమాణం చేస్తారని ఆప్‌ సీనియర్‌ నేత, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా బుధవారం మీడియాకు తెలిపారు. క్యాబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్న మంత్రులను తిరిగి తీసుకోవాలని కేజ్రీవాల్‌ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే యువనేతలు ఆతిషి మర్లేనా, రాఘవ చద్దాలకు క్యాబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉంది.